డ్రగ్స్ కేసులో ఈడీ ముందుకు రకుల్ ప్రీత్.. కీలకం కానున్న రకుల్ ఇంటరాగేషన్
ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ అధికారులు రంగంలోకి దిగి విచారణ వేగం చేశారు. నాలుగేళ్లునాటి కేసు దుమ్ము దులిపి ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ ప్రముఖులకు నోటీసులు ఇవ్వడంతో టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. డ్రగ్స్ కేసుల వ్యవహారంలో నటి రకుల్ ప్రీత్ సింగ్ ఈడీ ఎదుట శుక్రవారం విచారణకు హాజరుకానున్నారు. నిజానికి ఈనెల 6న విచారణకు హాజరుకావాలని ఆమెకు ఈడీ నోటీసులు జారీ చేసింది. వ్యక్తిగత కారణాల దృష్ట్యా తేదీని మార్చాలంటూ ఈడీ అధికారులకు రకుల్ లేఖరాశారు. ఆ లేఖను అధికారులు పరిశీలించారు.
ఆమె అభ్యర్థనను తిరస్కరించినా.. తర్వాత శుక్రవారం విచారణకు రావాలని ఆదేశించారు. గతంలో సిట్ అధికారులు విచారించిన సినీ ప్రముఖల జాబితాలో రకుల్ పేరు లేదు. కెల్విన్కు ఆమె నగదు పంపించినట్లుగా ఈడీ ఆధారాలు సంపాదించినట్లు తెలుస్తోంది. ఆ వివరాల ప్రకారమే నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. నిన్న నటి చార్మిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ప్రశ్నించింది. ఆమె వ్యక్తిగత బ్యాంక్ ఖాతాల్లోని అనుమానాస్పద లావాదేవీలపై అధికారులు ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది.
గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు దాదాపుగా ఆమెను 8 గంటలపాటు విచారించారు. 2015-18 మధ్యకాలంలో నాలుగు ఖాతాల స్టేట్మెంట్లను ఆమె చార్టెట్ అకౌంటెట్ ఈడీ అధికారులకు ఇచ్చారు. ఐదుగురు సభ్యులతో కూడిన బృందం చార్మిని విచారించింది.ఈడీ అధికారుల విచారణలో కెల్విన్ ఎవరో తనకు తెలియదని చార్మి చెప్పందని తెలుస్తోంది. అతడితో ఆర్థిక లావాదేవీలపై వాట్సాప్ చాటింగ్లో పలుమార్లు చర్చించారని అధికారులు వివరించారు. వాట్సాప్ చాటింగ్, కాల్డేటా వివరాలను ఆమెకు చూపిస్తూ ప్రశ్నించారు. చార్మి ఆ ప్రశ్నలకు సమాధానాలను దాటవేసినట్లుగా తెలుస్తోంది. కెల్విన్తో పాటు మరో ముగ్గురి డ్రగ్ పెడ్లర్ల ఫొటోలను చార్మికి చూపించగా.. వారెవరో తనకు తెలియదని సమాధానమిచ్చారు.
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కింగ్ పిన్గా ఉన్న కెల్విన్ అప్రూవర్గా మారడంతో ఈడీ అధికారులు సినీ ప్రముఖులకు నోటీసులు జరీ చేసిన విషయం తెలిసిందే. ఈడీ విచారణలో కెల్విన్ సంచలన విషయాలు బయట పడినట్లు సమాచారం. ఆరు నెలలు క్రితమే ఈకేసులో కెల్విన్ అండ్ గ్యాంగ్ను విచారణ చేశారు. ఈడీ అధికారుల ముందు సినీ ప్రముఖులతో తనకున్న పరిచయాలను ఈడీ ముందు కెల్విన్ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. కెల్విన్ అకౌంట్లకు భారీగా ప్రముఖులు నిధులు బదిలీ చేసినట్లు ఈడీ విచారణ లో తేలింది.
ఇప్పటికే కెల్విన్కు చెందిన మూడు అకౌంట్లను ఫ్రీజ్ చేశారు. కెల్విన్ అకౌంట్లు ఆధారంగా సినీ ప్రముఖల నగదు బదిలీపై ఈడీ కొంత అవగాహనకు వచ్చింది. ఈ కేసులో ఎంత మొత్తంలో మనీలాండరింగ్ పాల్పడ్డారు.. అనేది విచారణలో తేలాల్సి ఉంది. మనీలాండరింగ్కు పాల్పడినట్లు సినీ ప్రముఖులపై ఆరోపణలు రావడంతో మరోసారి ఈడీ అధికారులు రంగంలోకి దిగి విచారణ చేస్తున్నారు. ఇప్పటికే ప్రముఖ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ను ఈడీ దాదాపు పది గంటలు పాటు విచారణ చేసి స్టేట్మెంట్ రికార్డు చేశారు. పూరీ జగన్నాథ్తో పాటు చార్టెడ్ అకౌంటెడ్ కూడా విచారణకు హాజరయ్యారు. డ్రగ్స్ను విదేశాలు నుండి కొనుగోలు చేసినట్లు ఆరోపణలు రావడంతో డ్రగ్స్ ఎవరి దగ్గర కొనుగోలు చేశారు? కొనుగోలు చేస్తే డ్రగ్స్కు నగదు ఎలా చెల్లించారు? విదేశాలకు చెల్లింపు జరిగాయా? తదితర అంశాలు పై ఈడీ అధికారులు దృష్టి పెట్టారు. 2015 నుండి జరిగిన బ్యాంకు లావాదేవీలు మొత్తం ఈడీ అధికారులకు పూరీ సమర్పించారు.
సెప్టెంబర్ 2 తేదీన చార్మి, 4న రకుల్, 8న దగ్గుబాటి రానా, 9న రవితేజ, 13న నవదీప్, 15న ముమైత్ ఖాన్, తనీష్, నందు, తరుణ్, రవితేజ డ్రైవర్ శ్రీనివాస్, నవదీప్ను విచారించనున్నారు. ఇప్పటికే డ్రగ్స్ కొనుగోలు చెల్లింపులు, బ్యాంకు అకౌంట్లతో పాటు, బిట్ కాయిన్స్ ద్వారా చెల్లింపులు జరిగినట్లు తేలింది. ఇప్పటి వరకు ఈడీ అధికారులు డ్రగ్స్ కొనుగోలు, వినియోగం, సరఫరాపై దృష్టి సారించి కేసులు నమోదు చేశారు. అయితే ఇప్పుడు డ్రగ్స్ కొనుగోలుపై చెల్లింపులు ఎలా జరిగాయి. ఇందులో మనీ లాండరింగ్కు ఎంత మొత్తంలో పాల్పడ్డారు. 12 మంది సినీప్రముఖుల్లో ఎవరి పాత్ర ఎంత అనే దానిపై ఈడీ దృష్టి పెట్టింది. మిగతా నిందితులను సెప్టెంబర్ 22 వరకు ఈడీ అధికారులు విచారించనున్నారు.