తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయం ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన ఆద్యాత్మిక క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఒడ్డికాసులవాడికి కోట్లల్లో భక్తులు కానుకలు సమర్పిస్తూ ఉంటారు. భక్తులు సమర్పించిన కానులతో శ్రీవారు సిరిసంపదలతో తులతూగుతున్నారు. కలియుగ దైవం తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి ఆస్తులు ఎన్ని ఉన్నాయో లెక్కతేలింది. వాటికి సంబంధించిన వివరాలను టీటీడీ వెల్లడించింది. శ్రీవారికి 14 టన్నుల బంగారం, 14 వేల కోట్ల డిపాజిట్లు ఉన్నాయని తేలింది. టీటీడీకి 960 స్థిర ఆస్తులు ఉండగా, వాటి విలువ రూ.85,705 కోట్లు. అలాగే స్వామివారి పేరుతో 7123 ఎకరాల భూమి ఉంది. టీటీడీకి వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రూ.14,000 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లుఉన్నాయి. 14 టన్నుల బంగారం ఉందని టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు. 1974 నుంచి 2014 మధ్య కాలంలో అప్పటి ట్రస్ట్ బోర్డులు స్వామివారికి చెందిన 113 ఆస్తులను విక్రయించినట్లు ఆయన పేర్కొన్నారు. 2014 తర్వాత ఇప్పటి వరకు ఎలాంటి ఆస్తులు అమ్మలేదని, టీటీడీకి ఉన్న ఆస్తులు, వాటి విలువలను టీటీడి అధికారిక వెబ్సైట్లో ఉంచామని సుబ్బారెడ్డి తెలిపారు.