గల్లీ పార్టీకి.. ఢిల్లీలో ఆఫీస్‌ ఎందుకు..?: సీతక్క

గల్లీ పార్టీకి.. ఢిల్లీలో ఆఫీస్‌ ఎందుకు..?: సీతక్క

ఆర్.బి.ఎం మహబూబాబాద్‌: తమది గల్లీ పార్టీ అని చెప్పుకుంటున్న టీఆర్‌ఎస్ కు ఢిల్లీలో ఆఫీస్‌ ఎందుకని మహిళా కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే ధనసరి సీతక్క ప్రశ్నించారు. రెండు, మూడ్రోజులుగా వర్షాలతో వరదలు వచ్చి ఇళ్లు కొట్టుకుపోతుంటే పట్టించుకోని రాష్ట్ర పాలకులు టీఆర్‌ఎస్‌ జెండా పండగలు చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఆర్తీ గార్డెన్‌లో కాంగ్రెస్‌ పార్టీ జిల్లాస్థాయి విస్తృత స్థాయి సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఈసందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే సీతక్క మాట్లాడారు. ఏడేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు కష్టాలు, కన్నీళ్లు మిగిలితే సీఎం కేసీఆర్‌ కుటుంబానికి మాత్రం ఆస్తులు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ పేదలకు భూములు ఇస్తే టీఆర్‌ఎస్‌ మాత్రం వాటిని లాక్కుంటూ ఇబ్బందులకు గురిచేస్తుందని విమర్శించారు. ఉద్యోగాలు లేక యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నప్పటికి పట్టించుకున్న పాపన పోలేదని, టీఆర్‌ఎస్‌ పాలనలో ఎన్ని ఉద్యోగాలిచ్చారో చెప్పాలని సీతక్క డిమాండ్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published.