ఏపీలో పార్టీ పెట్టాలంటూ కోరుతున్నారు.. కోరికను నెరవేరుస్తా: బ్రదర్ అనిల్
ఆర్.బి.ఎం విశాఖ: ఏపీలో మరోపార్టీ పురుడు పోసుకోబోతోంది. వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్కుమార్ ఏపీలో పార్టీ పెట్టేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. అందులోభాగంగా ఆయన విశాఖలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంఘాలతో సమావేశమయ్యారు. పార్టీ పెట్టాలని అన్ని సంఘాల వారు కోరుతున్నారని తెలిపారు.
పార్టీ పెట్టడం చాలా పెద్ద విషయమని చెప్పారు. పార్టీ పెట్టడంపై సుదీర్ఘంగా ఆలోచిస్తానని పేర్కొన్నారు. బీసీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని సీఎంగా చేయాలని డిమాండ్ వస్తోందని, అభిమానుల కోరికను కచ్చితంగా నెరవేరుస్తామని అనిల్ స్పష్టం చేశారు. తాను వాళ్ల మాట వినాల్సిందేనని, ఎవరి సాయం లేకుండా ఎవరూ పదవుల్లోకి రాలేరని తెలిపారు. ప్రజలంతా పాలించమని నాయకులను ఉద్యోగం ఇచ్చారని అనిల్ తెలిపారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు న్యాయం జరగడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై సీఎం జగన్కు లేఖ రాస్తానని ప్రకటించారు. సీఎం జగన్ను కలిసి రెండున్నరేళ్లైందని వెల్లడించారు. జగన్ అపాయింట్మెంట్ తనకు అవసరం లేదని బ్రదర్ అనిల్ తేల్చిచెప్పారు. వివేకా హత్యపై బ్రదర్ అనిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసు నుంచి దోషులు తప్పించుకోలేరని హెచ్చరించారు. సీబీఐ నిష్పాక్షిక దర్యాప్తు చేస్తోందని, కచ్చితంగా న్యాయం జరుగుతుందని బ్రదర్ అనిల్ ఆశాభావం వ్యక్తం చేశారు.